అమరావతి రాజధానిలో నేడు నిరసనలు మిన్నంటాయి. ప్రధాని మోదీ ఈ రోజుకి శంకుస్థాపని చేసి ఐదేళ్లు పూర్తయిన సందర్బంగా రైతులు, మహిళలు నిరసనలు తెలిపారు. దీంతో రాజకీయ నాయకులు కూడా నేడు తమ కామెంట్లలో వేడి పెంచారు. టిడిపి అధినేత చంద్రబాబు సైతం అమరావతిపై స్పందించారు.
కోలాహాలంగా నిర్మాణ పనులతో కలకలలాడిన అమరావతి ఇప్పుడు స్తబ్దుగా ఉందని చంద్రబాబు అన్నారు. అమరావతిపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 10వేల కోట్లతో పనులు చేస్తే నిరుపయోగం చేశారని తెలిపారు. వ్యక్తిపైనో, పార్టీపైనో కక్షతో రాజధాని నిర్మాణాన్ని భగ్నం చేయడం రాక్షసత్వమన్నారు. రాజధానిని కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడి కర్తవ్యమన్నారు. రాష్ట్రం కోసం రోడ్లపాలైన అమరావతి రైతులకు సంఘీభావం తెలపాలని, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ను కాపాడాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇక ఇదే అంశంపై మంత్రి బొత్స సత్యానారాయణ మాట్లాడారు. అమరావతిలో చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాజధానిలో చంద్రబాబు 5శాతం పనులు కూడా చేయలేదన్నారు. కనీసం కరకట్ట రోడ్డు కూడా వేయలేదన్నారు. చంద్రబాబు బాధంతా బినామీల కోసమేనని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు పశువుల్ని మేపారని చెప్పారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చంద్రబాబుకు ఇష్టంలేదన్నారు. కమ్యూనిస్టు పార్టీలు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించడంలేదని ఆయన ప్రశ్నించారు.