వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్లో రహస్య మంతనాలు ఏంటని టిడిపి ఎంపీలు ప్రశ్నిస్తున్నారు. జగన్ కేంద్రమంత్రులను కలిసిన దాంట్లో ఏముందో బయటకు చెప్పకుండా ఉండటమేంటని అడుగుతున్నారు.
జగన్ను తిట్టారో, మందిలించారో, ఏమైనా హామీలిచ్చారో తెలియదన్నారు. జగన్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా రహస్య మంతనాలు జరపడం తప్ప ఇక్కడ ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పింది లేదని టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడుతూ అప్పట్లో ప్రత్యేక హోదా తెస్తామని చెప్పిన వైసీపీ దానిమీద ఏం పోరాడుతున్నారో చెప్పడం లేదన్నారు.
వైసీపి నేతలకు ఇంకా జైలుకు వెళతామన్న భయం పట్టుకుందన్నారు. జైలుకు వెళ్లకుండా ఉండటానికి లోక్సభ, రాజ్యసభను ఉపయోగించుకుంటున్నారన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చారని మండిపడ్డారు. పార్లమెంటులో వైసీపీ ఎంపీలు మాట్లాడిన దాంట్లో రాష్ట్ర ఎంజెడా ఎక్కడా లేదన్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ చెల్లింపుల కోసం ప్రత్యేక కార్యక్రమంగా చేస్తున్నప్పుడు వైసీపీ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను టిడిపి ఎంపీలు కలిశారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పనులు చేయించిన సర్పంచులకు బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేవలం వ్యక్తిగత కక్ష్యతో టిడిపిని దెబ్బ తియ్యాలన్న ఆలోచనతో అప్పుడు చేసిన పనులకు పేమెంట్ చెయ్యడం లేదన్నారు.