టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేని పనులు వైసీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్నాయని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. వై.ఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెలుతోందన్నారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ కార్యక్రమాలు వెళుతున్నాయని చెప్పారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిడిపిలో ఎలాంటి పరిస్థితులు ఉండేవో చెప్పారు.
రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి మనుగడ లేదన్నారు. 20, 30 ఏళ్ల పాటు జగన్ సీఎంగా ఉంటారన్నారు. విశాఖలో లేని ఉద్యమాలు చేయమంటే ఎలా చేస్తామన్నారు. సీఎం జగన్పై మనసు చంపుకొని విమర్శలు చేశానని ఇక టిడిపిలో ఉండలేనన్నారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమన్నారు. పేద ప్రజల కోసం పరిపాలన చేస్తున్న జగన్ నాయకత్వంలో పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో 14 నెలల్లో 59 వేల కోట్లు ప్రజాసంక్షేమానికి జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని టిడిపి చూస్తోందన్నారు. పేదల కోసం ఉద్యమాలు చేయలేదని.. కోర్టులకు వెళ్లి పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకున్నారన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీకి మనుగడ లేదన్నారు. ఇక పరిపాలనా రాజధానిగా విశాఖను ఆనాడే స్వాగతించానని ఆయన అన్నారు. అయితే కొందరు దీన్ని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే గణేష్ మండిపడ్డారు.