కరోనా మహమ్మారిని అరికట్టేందుకు కొవాగ్జిన్ టీకాను అభివృద్ది చేస్తున్న భారత్ బయోటెక్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ముక్కుద్వారా ఇచ్చే టీకాను అభివృద్ధి చేస్తుంది. దీన్ని ఉత్పత్తి చేసేందుకు భారత్ బయోటెక్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. కోటి టీకాలు ఉత్పత్తి చేస్తామని భారత్ బయోటెక్ చెబుతోంది.
వాషింగ్టన్ టీకాను ముక్కు ద్వారా లోపలికి పంపిస్తారు. దీని వల్ల ముక్కులో, గొంతులో ఉన్న వైరస్ చనిపోయేందుకు ఆస్కారం ఉంటుంది. శరీరంలో ఇంజెక్షన్ వల్ల ఇచ్చే టీకా వల్ల కాకుండా ముక్కు ద్వారా ఇవ్వడంతో మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో పాటు సిరంజీలు, సూదుల కోసం ఖర్చు పెట్టే కోట్లాది రూపాయలు సేవ్ అవుతాయని అంటున్నారు.
ఈ వ్యాక్సిన్ను సింగిల్ డోస్లో ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం తయారుచేస్తున్న టీకాల కంటే ఇది బాగా పనిచేస్తుందని నిపణులు పేర్కొంటున్నారు. తమకున్న అనుభవంతో వ్యాక్సిన్ను వేగంగా ప్రజల వద్దకు చేర్చుతామని భారత్ బయోటెక్ తెలిపింది. దీనికి సంబంధించిన మొదటి దశ ప్రయోగాలు సెయింట్ లూయిస్లో జరుగుతాయి. ఆ తర్వాత అన్ని అనుమతులు పొందాక ఇండియాలో నిర్వహించి అనంతరం ఉత్పత్తి చేస్తారు. అయితే ఇప్పటికే రష్యా వంటి దేశాలు వ్యాక్సిన్ తయారీలో కీలక దశకు చేరుకున్నాయి. అయినప్పటికీ ఈ వ్యాక్సిన్ మాత్రం తనదైన శైలిలో పని చేస్తుందని చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్కు సంబంధించి అమెరికా, జపాన్, ఐరోపా మినహా మిగిలిన దేశాల్లో పంపిణీకి భారత్ బయోటెక్ హక్కుల్ని సొంతం చేసుకుంది.