ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు ఒకే అంశంపై తిరుగుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే మతం అనే అంశాన్ని తెరపైకి తెస్తున్నాయన్న వాదన ఉంది. ప్రజల్లో ఆదరణ కోల్పోయిన కొందరు ఇలా కేవలం పబ్లిసిటీ పొందేందుకే మతాన్ని ఆయుధంలా వాడుకుంటున్నారన్న అనుమానాలు బయటకు వస్తున్నాయి.
ఏపీలో దేవాలయాల్లో దాడులపై మొదలైన రాజకీయాలు ఇప్పుడు మతం, డిక్లరేషన్ అంటూ పెద్ద ఎత్తున చర్చ వరకు సాగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీల ఏ నాయకుడు మాట్లాడినా ఇప్పుడు డిక్లరేషన్ గురించే మాట్లాడుతూ రచ్చ చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని డిక్లరేషన్ మాట ఇప్పుడు ఎందుకు వినిపిస్తోందో అన్న ప్రశ్న తలెత్తుతోంది. అసలు డిక్లరేషన్ అంశం గురించి రాద్దాంతం జరుగుతోందా లేక తమ ఉనికిని చాటుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు తహతహలాడుతున్నారా అన్న ప్రశ్న తలెత్తుతోంది.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆలయాలు, మత సంబంధమైన కట్టడాలు కూల్చేశారన్న వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ఇదంతా చేసిన పచ్చ పార్టీ నాయకులు ఇప్పుడు లేనిది ఉన్నట్టు మాట్లాడుతూ ప్రభుత్వంపై బురదజల్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అర్థమవుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం భారీ మెజార్టీతో గెలవడం నచ్చని ప్రతిపక్షాలు ఇప్పుడు అవకాశం దొరికిన ప్రతిసారీ విషయాన్ని వివాదంలా మార్చేందుకు కుట్ర పన్నుతున్నట్లు మేధావులు మాట్లాడుకుంటున్నారు. అందుకోసమే ప్రధానంగా మతం ఆధారం చేసుకొని రాజకీయాలు చేస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఉదాహరణగానే ఇటీవల ఆలయాల్లో జరుగుతున్న ఘటనలు తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా సీఎం జగన్ పై ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయాలని ఇలా పనిగట్టుకొని మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు.