మహానటితో సూపర్ సక్సెస్ అందుకున్న దర్శకుడు నాగ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. ఇక ఈ సినిమా కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు మెంటర్ గా వ్యవహరించనున్నారని చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం విదితమే. ఇంతకీ సింగీతంకు, ఈ చిత్రానికి సంబంధం ఏంటన్న దానిపై ఓ ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
ప్రభాస్, నాగ అశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే చిత్రం టైమ్ మిషన్ కథాంశంతో రానుందని సమాచారం. ఇక సింగీతం శ్రీనివాసరావు టైమ్ మిషన్ కాన్సెప్ట్ తోనే ఆదిత్య 369 సినిమాని తీసిన సంగతి తెలిసిందే. దీంతో.. టైమ్ మిషన్ కాన్సెప్ట్తో సినిమా తీసిన అనుభవం ఉండటం వల్లే ఈ మూవీకి సింగీతం అనుభవం ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యంతో ఆయనను ఈ సినిమా కోసం తీసుకున్నారని తెలుస్తోంది.