ఈఎస్ఐ స్కాంలో అరెస్టైన మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అచ్చెన్నాయుడు ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్య కారణాల రిత్యా ఆసుపత్రిలో ఉంటున్న ఆయన ఇంకెనాళ్లు ఇలాగే ఉంటారని పొలిటికల్ డిస్కషన్ నడుస్తోంది.
ఈఎస్ఐ హాస్పిటల్స్లో టెలి మెడిసిన్, మందుల కొనుగోళ్ల అక్రమాల కేసులో అచ్చెన్నాయుడు అరెస్టైన విషయం తెలిసిందే. రూ. 150 కోట్లు పక్కదారి పట్టాయన్న ఈ కేసులో అచ్చెన్నతో పాటు పలువురు అధికారులు సైతం రిమాండ్లో ఉన్నారు. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు జూన్ 13వ తేదీన అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆ నెల మొత్తం ఆయన గుంటూరు హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఆయనకు అప్పటికే మొలల ఆపరేషన్ జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుంళం నుంచి విజయవాడకు వెళ్లే క్రమంలో ఆపరేషన్ జరిగిన చోట రక్త స్త్రావం జరిగిందని ఆయన తరుపు న్యాయవాదులు చెప్పడంతో విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు చికిత్స అందించాలని ఆదేశించింది.
ఆ తర్వాత ఆయనకు జీజీహెచ్ వైద్యులు మరోసారి శస్త్రచికిత్స చేయడంతో జులై 1వతేదీన ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు తాను ఇంకా కోలుకోలేదని చెప్పారు. కరోనా పరీక్షలు కూడా చేయాలని కోరినా వైద్యులు డిశ్చార్జ్ చెయ్యడంతో ఆయన్ను పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు.
ఆ తర్వాత జైలులో తాను వ్యక్తిగత పనులు చేసుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అచ్చెన్న వినతిని మన్నించడంతో ఆయన జూలై 8వ తేదీ నుంచి గుంటూరులోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ జ్యూడిషియల్ రిమాండ్లో కొనసాగుతున్నారు. దాదాపు 35 రోజుల నుంచి ఆయన హాస్పిటల్లోనే ఉంటున్నారు. అచ్చెన్నాయుడికి ఆపరేషన్ చేసి ఇప్పటికి దాదాపు 50 రోజులైపోయింది. అయినప్పటికీ ఆయన ఇంకా ఆసుపత్రిలోనే ఉండటం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. మొలల ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి ఇన్ని రోజులు ఎలా రెస్ట్ తీసుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అసలు ఆయన ఆరోగ్య పరిస్థితి ఏమిటన్నది ఎవ్వరకీ తెలియడం లేదు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదిక బయట పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరినా బెయిల్ లభించలేదు. ఆయన పెట్టుకున్న పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. అచ్చెన్నాయుడు ఇంకెన్నాళ్లు హస్పిటల్లో ఉంటారన్న విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.