కరోనా విజృంభిస్తుంటే జనాలు బెంబేలెత్తిపోతున్న విషయం తెలిసిందే. అయితే ఏపీలో మాత్రం కరోనా కొందరికి మేలు చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ నేతలకు కరోనా కలిసొస్తోంది. ఎంత ప్రయత్నించినా రాని బెయిల్ కరోనా పరిస్థితుల దృష్ట్యా వచ్చేస్తోంది.
అనంతపురం జిల్లానేత మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డికి ఇటీవలె బెయిల్ మంజూరైంది. అయితే కడప జైలులో ఇటీవల కరోనా విజృంభించింది. జైలులో ఉన్న ఖైదీల్లో చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వీరిలో జేసి ప్రభాకర్ రెడ్డి కూడా ఉన్నారు. దీంతో ఆయన తనకు బెయిల్ మంజూరు చేయాలని అనంతపురం జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు ను కోరారు. దీంతో కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ నెల 19వ తేదీన ఆయన విడుదలైన విషయం తెలిసిందే.
తాజాగా మరో టిడిపినేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైంది. మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర అరెస్టై రిమాండ్లో ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. మచిలీపట్నం కోర్టు, హైకోర్టులను బెయిల్ ఇవ్వాలని కోరినా కూడా ఇవ్వలేదు. అయితే మరోసారి ఆయన బెయిల్ కావాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తికి పిటిషన్ పెట్టుకున్నారు.
అయితే ఈ సారి జైల్లో కరోనా కేసులు ఉన్నాయని అందుకోసం తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. కరోనా నేపథ్యంలో ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇలా కరోనా విజృంభిస్తుండటంతో పొలిటికల్ లీడర్లకు కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు. ఎన్ని విధాలా ప్రయత్నించినా బెయిల్ పొందని వీరు చివరకు కరోనా కారణంగా బయటకు వచ్చేస్తున్నారు.