ఏపీలో వరుస ప్రమాదాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్లో అగ్నిప్రమాదం సంఘటన మరువకముందే విశాఖలో మరో ఘటన జరిగింది. దీంతో ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగినా ప్రజలు భయపడిపోతున్నారు.
విశాఖలో మధుర వాడ సమీపంలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో వాల్మికీ క్యాంపస్ను క్వారంటైన్ కేంద్రంగా చేశారు. ఇక్కడ 64 మంది రోగులు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఉన్నట్టుండి సోమవారం సాయంత్రం పొద్దుపోయాక 7 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంప్యూటర్ రూంలో షార్ట్ సర్య్కూట్ కావడం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో అక్కడున్న రోగులు, సిబ్బంది పరుగులు తీశారు.
వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిని చేరుకుని మంటలను అదుపు చేశారు. కోవిడ్ రోగులను పక్కనే ఉన్న భగీరథ క్యాంపస్లోనికి తరలించడంతో పెను ప్రమాదం తప్పింది. రెండో అంతస్థులో ఈ మంటలు చెలరేగాయి. మొన్న విజయవాడలో జరిగిన కోవిడ్ కేర్ అగ్నిప్రమాదంలో 10 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. అయితే విశాఖ ప్రమాదం జరగడంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అధికారులు పరుగులు తీశారు. అయితే విశాఖ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
సంఘటనా స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై ఆరా తీశారు. అయితే కోవిడ్ కేర్ సెంటర్లలో ఇలా జరుగుతుండటంపై కోవిడ్ రోగులు, బంధువులు, స్థానికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచైనా ఇలాంటి ఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.