ఏపీలో సంచలనం సృష్టించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలకు వై.ఎస్ జగన్ సర్కార్ ఆదుకుంది. స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. బాదిత కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున పరిహారం అందించారు. ఈ చెక్కులను మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, కొడాలి నాని అందజేశారు.
సరైన నాణత్య ప్రమాణాలు, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కోవిడ్ కేర్ సెంటర్లు నడుపుతున్న యాజమాన్యాల పట్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలు ఇప్పటికైనా తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. రమేష్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల పది మంది చనిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉందన్నారు.
పది మంది మృతుల కుటుంబాల్లో ఆరుగురికి చెక్కులు అందజేశారు. మరో నలుగురికి కూడా అందజేస్తామన్నారు. రమేష్ హాస్పిటల్ గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో అని నోటీసులు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అగ్నిప్రమాదం ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. సీఎం జగన్ మానవత్వంలో స్పందించి నష్టపరిహారం అందించారన్నారు.