ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతలకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరుగుతుండటం రాజకీయంగా చర్చ అవుతోంది. మొన్న విజయవాడలో టీడీపీ నేత పట్టాభిరాం కారుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ప్రతిపక్ష టిడిపి ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఇది మరిచిపోకముందే మరో నేత కారుపై దాడి జరిగింది.
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం, కొత్తరమంగళం గ్రామంలో టీడీపీ సీనియర్ నేత దేవేందర్ రెడ్డి వాహనంపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆయన ఇంటి వద్ద పార్కింగ్ చేసిన కారు అద్దాలను ధ్వంసం చేశారు. అయితే ఈ పని ఎవరు చేశారన్న దానిపై క్లారిటీ లేదు. దేవేందర్ రెడ్డి మాత్రం ఇది వైసీపీ నేతల పనే అని ఆరోపిస్తున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ నేతల వాహనాలను ఎవరు టార్గెట్ చేశారన్నది తెలియాల్సి ఉంది. అయితే వారం రోజుల్లోపు మరో ఘటన జరగడం వివాదాస్పదమైందని చెప్పొచ్చు. ఈ విషయంపై తిరుపతి టీడీపీ అధ్యక్షుడు నరసింహయాదవ్ మండిపడ్డారు. దాడి చేసిన వారు ఆయుధాలు కూడా అక్కడే వదిలేసి వెళ్లారని అంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
వారం రోజుల నుంచి ఏపీలో రాజకీయాలు వాహనాల దాడులపైనే జరుగుతున్నాయి. టిడిపి నేతల కార్లపై దాడులు జరిగితే వైసీపీ నేతలే చేయించారని అంటోంది టిడిపి. అయితే రాజకీయంగా ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దాడులు ఆకతాయిలు చేసినా వైసీపీ మీదే నెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరి చిత్తూరు జిల్లాలో ఈ దాడిపై కామెంట్లు ఏస్థాయికి వెళతాయో చూడాలి. కాగా రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయంపై స్పందిస్తున్న చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఎలా స్పందిస్తారో అన్నది ఆసక్తిగా ఉంది. ఇప్పటికే ఈయన డీజీపీకి లేఖలు రాస్తున్నారు. ఇప్పుడు మరో టిడిపి నేత కారు దాడిపై కూడా డీజీపీకి లేఖ రాస్తారా అని ప్రజలు అనుకుంటున్నారు.