ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య దాడులు పెరిగిపోయాయి. ఆలయాలపై దాడులు చేస్తున్న ఘటనలు వింటూనే ఉన్నాం. తాజాగా దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
జిల్లాలోని భామిని మండలం కొరమలో వై.ఎస్సార్ విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని సెప్టెంబరు 2వ తేదీన ఆవిష్కరించారు. అంతలోపే దుండగులు దీన్ని ధ్వంసం చేశారు. అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. విగ్రహాన్ని పూర్తిగా పెలికించి కింద పడేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు రంగంలోకి దిగి దాడి ఎవరు చేశారన్న దానిపై విచారణ ప్రారంభించారు. అయితే ఇటీవల ఈ విగ్రహాన్ని ఆవిష్కరించామని డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్ చెప్పారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు విషయంలో కూడా ఎలాంటి వివాదం లేదని చెబుతున్నారు.
పేదల ఆశాజ్యోతి వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేయడంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆలయాలు, విగ్రహాలపై జరుగుతున్న దాడులపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి ఎవరు పాల్పడ్డారన్నది తెలియడం లేదు. ఆకతాయిలు చేసిన పని అనుకుంటే దాడి ఇంకో విదంగా జరిగి ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పక్కా ప్రణాళికతోనే దాడి చేయాలన్న కారణంతో పూర్తిగా విగ్రహాన్ని పెకిలించి కింద పడేసి వెళ్లినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.