ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూర్ జయరాం కుమారుడు గుమ్మనూర్ ఈశ్వర్పై టిడిపి సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. విలేఖర్ల సమావేశం ఏర్పాటుచేసిన ఆయన విలేఖర్ల సమక్షంలోనే ఏసీబీ కాల్ సెంటర్కు ఫోన్ చేశారు. ఈఎస్ఐ ఇన్సురెన్స్ కంపెనీలో అవినీతి జరిగిందని, ఈ కుంభకోణంలో మంత్రి కుమారుడి హస్తం ఉందని ఆయన ఫిర్యాదు చేశారు.
మంత్రి గుమ్మనూరు కుమారుడు ఈశ్వర్కు బెంజి కారు లంచంగా ఇచ్చారని వివరించారు. స్వయాన మంత్రి కుమారుడిపై మాజీ మంత్రి ఏసీబీ కాల్ సెంటర్కు కాల్ చెయ్యడం ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశమైంది. ఓ కేసులో ఏ 14 నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి బెంజికారు గిఫ్టుగా ఇచ్చారన్నారు. ఓ ముద్దాయికి మంత్రి కుమారుడికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆయన చూపించారు. ప్రభుత్వం దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలన్నారు.
దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపిస్తానని అయ్యన్నపాత్రుడు అన్నారు. గుమ్మనూర్ జయరాంను మంత్రిమండలి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే ఇదే సమయంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు టాపిక్ను కూడా తీసుకొచ్చారు. అచ్చెన్నను ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టు చేశారన్నారు. ఆధారాలు లేకుండా బీసీ నాయకుల జోలికి వస్తే సమాధి అవుతారని ఆగ్రహంగా మాట్లాడారు.