దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కరోనా కేసుల టెస్టింగులు పెంచాలని కేంద్రం ఇదివరకే చెప్పింది. ఈ పరిస్థితుల్లో కేసుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. కాగా ముంబైలో కేసుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో అధికారులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ముంబైలో ప్రతి రోజూ 4 వేల దాకా కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కరోనాను అదుపు చేసేందుకు లాక్ డౌన్ తరహాలో కర్య్ఫూ విధించాలని అధికారులు నిర్ణయించారు. ముంబై నగర కమీషనర్ ఈనెల 30వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.
కేసుల టెస్టింగ్ పెరిగితేనే పాజిటివ్ కేసులను గుర్తించి వైద్యం చేసేందుకు అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అన్ని రాష్ట్రాలకు ఈ మేరకు ఆదేశాలు కూడా ఇచ్చింది. మరోవైపు అన్లాక్ కొనసాగుతున్న తరుణంలో ప్రజలంతా స్వేచ్చగా బయటకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి రోజూ 4 వేల దాకా కొత్త కేసులు రావడం ఆందోళన కలిగించే విషయమే. చిన్నారులు, వృద్ధులతో పాటు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు మైకుల ద్వారా సూచనలు చేస్తున్నారు.