సుజనా రావు దర్శకత్వంలో నటి శ్రియ శరణ్ ప్రధానపాత్రలో గమనం అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల చిత్రయూనిట్ విడుదల చేసిన శ్రియ ఫస్ట్ లుక్ ఆమె అభిమానులను ఆకట్టుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో మరో అందాల నటి నిత్యా మీనన్ కూడా నటిస్తోంది. తాజాగా నిత్యామీనన్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ ను యువ హీరో శర్వానంద్ చేతుల మీదుగా విడుదల చేయించారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్ శాస్త్రీయ సంగీత గాయని శైలపుత్రి దేవిగా కనిపించనుంది. సంగీత కచేరీ చేస్తున్నట్లున్న ఈ ఫస్ట్ లుక్ తో సినిమాపై అంచనాలు పెరిగాయి. అసలు గమనం కథేంటో అన్న అంశంపై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూరుస్తున్నారు. ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా ఈ చిత్రానికి సంభాషణలు రాస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ‘గమనం’ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.