దేశంలోనే తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా ఉంటాయి. అప్పట్లో ఎంజీఆర్, జయలలిత ఉన్నప్పటి నుంచి తమిళ పాలిటిక్స్ సంచలనాలుగానే ఉండేవి. తాజాగా అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అందరి చూపు తమిళనాడు రాష్ట్రం వైపే ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో ఈ సారి సినీ గ్లామర్ కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఓ వైపు రజినీకాంత్, కమలహాసన్, విశాల్, విజయ్, లారెన్స్ ఇలా అందరి చూపు తమిళ రాజకీయాలవైపే ఉందని తెలుస్తోంది. జయలలిత తర్వాత మరో సంచలనం జరగాలంటే కొత్త వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలన్న డిస్కషన్ కూడా తమిళనాట నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలలోపు ఎప్పుడు ఏం జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ మధ్య సూపర్స్టార్ రజినీకాంత్ కొత్త పార్టీ వ్యవహారం ఊపందుకుంది. కొన్నేళ్లుగా రజినీ పార్టీ పెడతారని అనుకుంటున్నా ఆయన మాత్రం సైలెంట్గానే ఉంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏర్పాటు చేయబోయే పార్టీ పోటీ చేస్తుందని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు రజినీ పార్టీ రెడీ అవుతుందన్న చర్చ నడుస్తోంది. ఇక ఈ సారైన పార్టీ అనౌన్స్ చేస్తారా లేక ఇవి వార్తలు గానే మిగిలిపోతాయాన్నది వేచి చూడాలి.
ఇక హీరో విశాల్ కూడా త్వరలో ప్రముఖ రాజకీయ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. బీజేపీ వైపు ఆయన ఆసక్తిగా ఉన్నారన్న వార్తలను ఆయన ఖండించారు. ఓ ఇంటర్వూలో విశాల్ మాట్లాడుతూ తాను బీజేపీలో చేరతానన్న వార్తలను కొట్టి పారేశారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఖాళీపడిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు విశాల్ గతంలో నామినేషన్ కూడా వేశారు. అయితే చివరి క్షణంలో విశాల్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు.
మరి వచ్చే ఏడాది జరుగనన్నతమిళనాడు ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతుంటే కొత్త పార్టీల ఏర్పాటు కోసం కూడా నేతలు రెడీ అవుతున్నారు. కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ రాజకీయ నాయకులు పొలిటికల్ హీట్ను రాజేస్తున్నారు.