కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎక్కడ ఎలాంటి మందులు ఉన్నా వెంటనే అవి వాడేయాలని అనుకుంటున్నారు. దీంతో అనవసరమైన మందులు వాడి ప్రజలు ప్రాణాలమీదకు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇలాంటి తరుణంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
కరోనాకు ఆయుర్వేద మందు తయారుచేశానని హరియాణాకు చెందిన ఓం ప్రకాష్ వేద్ జ్ఞాన్తారా అనే ఆయుర్వేద వైద్యుడు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన మందు కరోనాను తగ్గిస్తుందని ఆయన అన్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిల్ వేసిన ఆ వైద్యుడు తన మందును భారత ప్రభుత్వం, ఆరోగ్యశాఖ, ఇతరులు వినియోగించేలా తీర్పు ఇవ్వాలని కోరారు.
అయితే ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అనాధారిత పిటిషన్లు వేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి ఆధారాలు లేకుండా దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఈ తరహా పిల్ వేయడాన్ని జస్టిస్ సంజయ్ కే. కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది.
అయితే తాను తయారుచేసిన ఈ మందు ప్రజలను ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుతుందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. చివరగా ధర్మాసనం పిటిషన్ను కొట్టివేస్తూ రూ. 10వేలు జరిమానా విధిస్తూ నాలుగువారాల్లోపూ ఇది కట్టాలని ఆదేశించింది.