ఏ చిన్న ఇబ్బంది వచ్చినా వెంటనే రోడ్లపైకొచ్చి నిరసనలు తెలిపే వారిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆందోళనలు చేయొచ్చా, చేస్తే ఎలాంటి ప్రదేశాల్లో చేయాలి అని క్లియర్గా చెప్పింది. ఓ కేసు విచారణ సందర్బంగా దీనిపై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ చట్టం దేశంలో ఓ అలజడిని సృష్టించిందని చెప్పొచ్చు. దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అయితే ఆ నిరసనల కోసం ఉయోగించుకున్న షాహిన్ భాగ్ స్థలం, రహదారులను నిరసనల కోసం వినియోగించుకోవడంపై సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్బంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. షాహిన్ భాగ్ వంటి ప్రభుత్వ స్థలాలను నిరసనల కోసం ఆక్రమించుకోవడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. ఎందుకంటే షాహిన్భాగ్ వద్ద గతేడాది డిసెంబరులో జరిగిన నిరసనలు దాదాపు 3 నెలలు కొనసాగాయి.
నిరసన కార్యక్రమాల వల్ల రాకపోకలు స్తంభించిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో ఈ కేసు విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దేశంలో నిరసనలు తెలిపేందుకు అందరిహక్కు ఉంటుందని కోర్టు పేర్కొంది. కానీ ఇతరులకు ఇబ్బందులు కలిగించకూడదని తెలిపింది. షాహిన్ భాగ్లో నిరసన కారులను తప్పించేందుకు కోర్టు ఆదేశాల కోసం వేచి చూడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందని పేర్కొంది. దీంతో సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల మేరకు ఇక నుంచి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా నిరసనలు చేస్తేనే బాగుంటుంది. లేదంటే ఆందోళన కారులను పోలీసులు చెదరగొట్టేందుకు చర్యలు తీసుకొనేందుకు వెనుకాడరని భావించొచ్చు. ప్రధానంగా రాస్తారోకోలు చేస్తూ ట్రాఫిక్ పెరిగేందుకు కారణమైన ఘటనలు చాలానే చూశాం. రద్దీ ఉన్న ప్రదేశాల్లో నిరసనలు తెలుపుతూ ప్రజా జీవనానికి ఇబ్బందులు కల్గించకూడదన్న విషయాన్ని ఆందోళన కారులు తెలుసుకోవాలి. అయితే చాలా చోట్ల ధర్నా చౌక్ అని ప్రత్యేకమైన ప్రదేశాల్లోనే ధర్నాలు చేసేందుకు అవకాశం కల్పించారు.