విజయవాడ రమేష్ హాస్పిటల్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్వర్ణ ప్యాలెస్ ఘటనలో విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. హాస్పిటల్పై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కొట్టి వేసింది.
రమేష్ హాస్పిటల్ స్వర్ణ ప్యాలెస్ హోటల్లో నిర్వహించిన కోవిడ్ కేర్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగి పది మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆస్పత్రి యజమాని డాక్టర్ రమేష్ ప్రమాదం జరిగినప్పటి నుంచి పరారీలో ఉన్న సంగతి తెలిసిందే. హైకోర్టు ఆయనకు, మరో డైరెక్టర్ సీతా రామ్మోహన్ రావులను అరెస్టు చేయకుండా స్టే ఇచ్చింది. దీనిని సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై విచారించిన సుప్రీం కోవిడ్ కేర్ సెంటర్ ప్రమాదంపై విచారణ జరిపేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తోసిపుచ్చింది. రమేష్ హాస్పిటల్, స్వర్ణ ప్యాలెస్ యజమానిలను అరెస్టు చేయకుండా దర్యాప్తు కొనసాగించాలని ఆదేశించింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీ పోలీసులు స్వర్ణ ప్యాలెస్ ఘటనలో దర్యాప్తు మళ్లీ ప్రారంభించనున్నారు.