దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే దాన్ని నిల్వ చేయడానికి అన్ని విధాలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కరోనా టీకా అందుబాటులోకి రాగానే అందరికీ పంపిణీ చేసేందుకు ఇప్పటినుంచే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో కరోనా వైరస్ టీకా అందుబాటులోకి రానున్నదని ప్రకటించారు. దీనిలో భాగంగా ముందుగా ఢిల్లీలో 40 నుంచి 50 లక్షల మందికి టీకా వేయనున్నారు. ఈ టీకా డోసులను భద్రపరిచేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో టీకాలను భద్రపరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లక్షల డోసుల టీకాను సురక్షితంగా ఉంచేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఫ్రీజర్ల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. ఈ ఫ్రిజర్లో ఏడాది పొడవునా టీకాను సురక్షితంగా ఉంచేందుకు వీలుంది.
ప్రస్తుతం ఈ ఫ్రిజ్ను ప్రభుత్వం ఫరీదాబాద్లోని ట్రాన్స్లేషన్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఉంచింది. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బీఎల్ షెర్వల్ మాట్లాడుతూ ఆసుపత్రి పరిసరాల్లో టీకాను సురక్షితంగా ఉంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. కాగా ఇటీవల ఢిల్లీలో కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదయ్యాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. కరోనా కట్టడికి ప్రత్యేక ఆంక్షలు కూడా విధించింది.