కరోనా వైరస్ సోకకుండ అంతా జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ మహమ్మారి బారిన పడుతూనే ఉన్నారు. ఇక కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల కరోనా మూడవ దశ ట్రయల్స్లో పాల్గొని టీకా తీసుకున్న వ్యక్తికి ఇప్పుడు కరోనా సోకింది. ప్రస్తుతం ఈ విషయం వైరల్ అవుతోంది.
హరియాణా హోంశాఖమంత్రి అనిల్ విజ్ కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలియజేశారు. అనిల్ విజ్ ఒక ట్వీట్లో తనకు కోవిడ్-19 టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అంబాలా సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాను. ఈమధ్య కాలంలో తనతో టచ్లో ఉన్నవారంతా కరోనా టెస్టు చేయించుకోవాలని కోరుతున్నానన్నారు. కాగా గత నవంబరు 20న దేశీయ వ్యాక్సిన్ మూడవ దశ ట్రయల్స్లో అనిల్ విజ్ టీకా తీసుకున్నారు.
ఆయన అంబాలా కెంట్లోని ఆసుప్రతిలో ఈ వ్యాక్సిన్ తీసుకున్నారు. పీజీఐ రోహతక్ బృందం పర్యవేక్షణలో అనిల్ విజ్కు టీకా వేయడం జరిగింది. టీకా తీసుకున్న అనంతరం 30 నిముషాల పాటు అనిల్విజ్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. దీనికిముందు పీజీఐ రోహతక్ బృందం… మంత్రి అనిల్ విజ్ రక్త నమూనాను సేకరించింది. దేశీయ టీకా కోవాక్సిన్ మూడవ దశలో మొత్తం 200 మంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. ఇప్పుడు వారిలో యాంటీబాడీ అభివృద్ధిపై అధ్యయనం చేస్తున్నారు.