సినీనటుడు సోనోసూద్ సహాయం చేస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయనకు వస్తున్న మెసేజ్లు చూస్తే ఎంత మంది సహాయం కోసం ఎదురుచూస్తున్నారో మనకు అర్థమవుతోంది. అందుకే సోనూ కొందరి మెసేజ్లు చూడలేకపోతున్నానని బాధపడి క్షమించమని కోరారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎంతో మంది సేవ చేస్తుంటారు. అయితే సోనూసూద్ మాత్రం చాలా ఎక్కువగానే సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పాలి. ఎక్కడెక్కడో ఇరుక్కుపోయిన వాళ్లని సొంత ఖర్చుతో ఇళ్లకు చేర్చారు. విమానాలు, రైళ్లు , బస్సులు ఇలా సహాయం అవసరమైన విధంగా ఆయన స్పందించి సొంతూళ్లకు చేర్చారు.
అయితే ఆయనకు ఎంతో మంది హెల్ప్ చేయాలని కోరుతున్నారని చెప్పారు. ఈ మెయిల్ ద్వారా 1137 మెసేజ్లు, ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా 19వేలు, ట్విట్టర్ ద్వారా దాదాపు 7వేల మెసేజ్లు వచ్చాయని సోనూ తెలిపారు. వీరంతా ఏదో ఒక రూపంలో సహాయం కోసం మెసేజ్ చేశారని ఆయన చెప్పారు. అయితే తాను అందరి మెసేజ్లు చూడలేకపోయానని అన్నారు. నేనొక్కడినే ఇంత మందికి సహాయం చేయడం సాధ్యంకావడం లేదన్నారు. అయినప్పటికీ తన వంతు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
కానీ ఇదే సమయంలో మనమంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సోనూ సహాయం చేస్తున్నారు కాబట్టి కష్టాల్లో ఉన్న వారంతా ఆయనకు సహాయం చేయాలని కోరుతున్నారా లేక నిజంగా దిక్కుతోచని స్థితిలో ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నారా అన్నది తెలియాల్సి ఉంది. ఎందుకంటే కొన్ని వేల మంది ఆయన సహాయం కోసం ఎదురుచూస్తున్నారంటే వీరందరికి వారి ప్రాంతాల్లో సహాయం అందడం లేదా అన్న ప్రశ్న తలెత్తుతోంది. మరి ఇంత మందికి సోనూ ఒక్కరు ఎలా సహాయం చేయగలరు.
దీనిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉంటాయి. ఆపదలో ఉన్న వారు స్థానికంగా ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లొచ్చు కదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి సోనూకు మెసేజ్ చేస్తున్న వారు ఎమ్మెల్యేలను, ప్రభుత్వాన్ని సంప్రదించడం లేదా.. లేక పట్టించుకోరని ఇలా సోనూ దగ్గరకు వెళ్తున్నారా. తెలియాల్సి ఉంది. ఫ్రీగా సోనూ సహాయం చేస్తున్నారని ఎవరైనా ఇలా కావాలని ఆయన్ను ఆశ్రయిస్తున్నారా ఆలోచించాలి.