బీహార్ ఎన్నికలు దేశంలో సంచలనంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న పలు వ్యాఖ్యలను బీజేపీ క్యాష్ చేసుకుంటోంది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల పాకిస్థాన్ అధికార ప్రతినిథిగా మారిందని బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు.
బీహార్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. హాజీపూర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో కచ్చితంగా బీజేపీ, జేడీయూ గెలుస్తుందన్నారు. బీహార్ ముఖ్యమంత్రిగా నితిష్ కుమార్ మళ్లీ కుర్చీలో కూర్చుంటారని జేపీ నడ్డా అన్నారు. ఎన్నికల్లో తమ పార్టీకి ఎక్కువ స్థానాలు లభించినప్పటికీ జేడీయూ చీఫ్, ముఖ్యమంత్రి నితీశ్ కుమారే తమ కూటమికి నాయకుడిగా కొనసాగుతారని చెప్పారు.
తమ కూటమికి మూడింట రెండొంతుల ఆధిక్యత లభిస్తుందని, ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తప్పుడు పాలన ప్రజలకు గుర్తుందని.. అలాగే నితిష్ కుమార్ మంచి పాలన కూడా ప్రజలు మర్చిపోలేరన్నారు. దీన్ని బట్టి బీహార్ ప్రజలు అభివృద్ధినే కోరుకుంటారని నడ్డా అన్నారు. విధ్వంసకర సీపీఐ-ఎంఎల్, కాంగ్రెస్లతో ఆర్జేడీ చేరిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల పాకిస్థాన్ అధికార ప్రతినిథిగా మారిందన్నారు. ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన నడ్డా తన ప్రసంగంలో నితిష్ కుమార్ను పొగిడేశారు. బీజేపీ అభ్యర్థి నేరుగా ఉంటే ఎలా మాట్లాడే వారో అలాగే నితిష్ను ఆయన పొగడడం ఈ ప్రచారంలో స్పష్టంగా కనిపిస్తోంది.
అయితే ఇది కూడా ఎన్నికల ప్రచారంలో భాగమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇతర పార్టీలు సైతం ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నాయి. ప్రధానంగా నితిష్ కుమార్పైనే పార్టీలు దృష్టి పెట్టాయి. నితిష్ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన విశ్వసనీయతను కోల్పోయారని, బీజేపీ-జేడీయూ కూటమి ఈ ఎన్నికల్లో పరాజయం పాలవుతుందని మహా కూటమి నేత తేజస్వి యాదవ్ అంటున్నారు. ఎవరికి నచ్చిన స్టైల్లో వాళ్లు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.