కరోనా మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు 91 శాతం రికవరీ రేటు ఉంది. అయితే ప్రజాప్రతినిధులు మాత్రం కరోనాకు బలవుతూనే ఉన్నారు.
తాజాగా తమిళనాడులో మంత్రి కరోనాతో మృత్యువాత పడ్డారు. కరోనా వైరస్ బారినపడి తమిళనాడు వ్యవసాయశాఖ మంత్రి దొరైక్కన్ను(72) కన్నుమూశారు. కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన చివరిశ్వాస విడిచారు. అక్టోబర్ 13వ తేదీన ఈయనకు కరోనా నిర్దారణ అయ్యింది. దీంతో వెంటనే విల్లుపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం కావేరీ ఆసుపత్రికి తరలించారు. శనివారం మంత్రి దొరైక్కన్ను ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల్లో 90 శాతం మేరకు ఇన్ఫెక్షన్ చేరినట్టు సీటీ స్కాన్లో వెల్లడయ్యింది.
దీంతో ఈసీఎంఓపై చికిత్స అందించారు. శనివారం రాత్రి 11.15 గంటలకు మంత్రి కన్నుమూశారు. మంత్రి దొరైక్కన్ను1948లో తంజావూరు జిల్లా రాజగిరిలో దొరైక్కన్నులో జన్మించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2016 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దొరైక్కన్నుకు భార్య, నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మంత్రి దొరైక్కన్ను మృతిపై సీఎం పళనిసామి, తమిళనాడు గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్ విచారం వ్యక్తం చేశారు. మంతి మంత్రి దొరైక్కన్ను అకాల మరణం తమిళనాడు ప్రజలకు, అన్నాడీఎంకే పార్టీకి కోలుకోలేని నష్టమని గవర్నర్ పేర్కొన్నారు.
కాగా దేశంలో చాలా మంది ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో పలువురు కరోనా నుంచి కోలుకున్నా ఇతర అనారోగ్య సమస్యల కారణంగా మృత్యువాత పడుతున్నారు. మొత్తానికి ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలు, ఎంపీలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.