మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా సుబ్బు దర్శకత్వంలో సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్కు జోడిగా.. నభా నటేష్ నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రంలోని ఒక పాట ప్రోమోను చిత్ర యూనిట్ వినూత్న పద్ధతిలో విడుదల చేసింది.
సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్లోని ఆల్ టైమ్ హిట్ బ్రేకప్ పాటలను ప్లే చేసి వింటూ ఉంటాడు. అయితే అన్ని పాటలు అయిపోవడంతో మ్యూజిక్ డైరెక్టర్ థమన్కు ఫోన్ చేసి ఏమైనా కొత్త బ్రేకప్ పాటలు ఉన్నాయా.. అమృత నన్నొదిలేసి వెళ్లిపోయింది రా.. అని అనగానే.. థమన్ వెంటనే ఓ పాటకు ట్యూన్ చేసి సాయి ధరమ్ ఫోన్కు పాటను పంపిస్తాడు. ‘ఒగ్గేసి పోకే అమృత నేను తట్టుకోక మందు తాగుతా.. ఒట్టేసి చెప్తున్నా అమృత నువ్వు వెళ్లిపోతే ఒంటరవ్వుతా’..అంటూ సాగే పాట ప్లే అవుతుంది. ఇలా వినూత్నంగా పాట ప్రోమోను విడుదల చేసిన చిత్రయూనిట్ పూర్తి పాటను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మరి టాలీవుడ్ ఆల్టైమ్ బ్రేకప్ పాటల జాబితాలో ఈ పాట కూడా చేరుతుందో చూడాలి.