జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్తించే వారికి ఇదొక బ్యాడ్ న్యూస్. ఎందుకంటే కుక్కే కదా ఏం చేస్తుందిలే అనుకుంటే ఎవరో ఒకరు మనల్ని గమనిస్తూ ఉంటారని తెలుసుకోవాలి.
ఇంతకీ ఏం జరిగిందంటే. పంజాబ్లో కుక్కను అతి దారుణంగా చంపేసిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఇందులో పెద్ద వింతేమీ కనిపించకపోయినా ఈ కేసు వెనక ఉన్నది ఓ ఎంపి. బీజేపీ ఎంపీ మేనకాగాంధీ పంజాబ్లోని దండుపూర్ గ్రామానికి చెందిన గుర్జిందర్ సింగ్ అనే వ్యక్తి కుక్కల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారని పోలీసులకు తెలియజేశారు.
ఆమె ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఇందులో సదరు వ్యక్తి కుక్క తన కారు ముందు ఉందని తెలిసినా కావాలని కుక్కపై కారుతో తొక్కించి వెళ్లాడు. తర్వాత ఆ కుక్క చనిపోయింది. దీనిపై మేనకాగాంధీ మాట్లాడుతూ ఆయన కుక్కలను పందేల కోసం పెంచుతూ ఉంటారని, అవసరమైతే వాటిని అమ్ముతుంటారన్నారు. కానీ ఇలా పందేలకు పనికి రాని కుక్కలను చంపేస్తుంటారని ఆమె ట్విట్టర్ ద్వారా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి వ్యక్తిపై చర్యలు తీసుకొని జైలుకు పంపాలన్నారు.
దీంతో ఈ విషయం సీఎం అమరీందర్ సింగ్ దృష్టికి కూడా వెళ్లింది. వెంటనే పోలీసులు ఈ అంశంపై కేసు నమోదు చేశారు. జంతువుల పట్ల క్రూరత్వ నిరోధక చట్టం కింద గుర్జిందర్ సింగ్పై కేసు బుక్ చేశారు. పోలీసులు ఇతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీన్ని బట్టి కుక్కలైనా మనుషులైనా ప్రాణాలు ఒక్కటే అన్న విషయాన్ని అందరూ గమనించాలి. అవసరమైతే జంతువులను రక్షించాల్సింది పోయి ఉద్దేశపూర్వకంగా ఇలా హింసించడం మంచిది కాదు.