రాష్ట్రంలో ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు లేఖ రాయడం తెలిసిందే. దీనిపై డీజీపీ స్పందించారు. ఏమైనా ఆధారాలుంటే తమకు ఇవ్వాలని చంద్రబాబును కోరారు. కాగా చంద్రబాబుకు ఇలా ఫోన్ ట్యాపింగ్పై మాట్లాడటం ఇదేమీ కొత్త కాదు. గతంలోనే చాలా సార్లు ఆయన ఫోన్ ట్యాపింగ్ గురించి బహిరంగంగా మాట్లాడారు.
వైఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో కూడా ఫోన్లు ఎలా ట్యాప్ చేస్తారని అన్నారు. ఇది చట్ట విరుధ్ధమన్నారు. ఇప్పుడు మరో సారి ఫోన్ ట్యాపింగ్పై ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్లో మాట్లాడింది ఎవరన్న దానిపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు కానీ.. ట్యాపింగ్ చేయడం కరెక్టేనా అంటూ ప్రశ్నించారు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షనేతలు, న్యాయవాదుల, ఇలా పలువురి ఫోన్లు ట్యాపింగ్ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మోదీకి లేఖ రాశారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వ సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరారు. అయితే ఇదే విషయంపై ఇప్పుడు ఏపీ డీజీపీ స్పందించి వివరాలు ఉంటే అందజేయాలని బాబును కోరారు. అప్పట్లో రెండు సార్లు తమ దగ్గర ఆధారాలున్నాయి. అవసరం అయితే వీటిని బయటపెడతామని చెప్పిన చంద్రబాబు.. ఈ సారైనా డీజీపీకి ఆధారాలు ఇస్తారా లేదాన్నది ఆసక్తిరేపుతోంది.