ఫోన్ ట్యాపింగ్ అంశం దుమారం రేపుతున్న నేపథ్యంలో పలు సెల్ఫోన్ ఆపరేటర్లు స్పందిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంత ఈజీ కాదని.. నిబంధనల మేరకు నడుచుకోవాల్సి ఉంటుందన్నారు.
ఏపీలో ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలపై పలు సెల్ఫోన్ కంపెనీలు స్పందించాయి. గత సంవత్సరం నుంచి ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయాలంటూ ఇంటిలిజెన్స్ అధికారుల నుంచి ఎలాంటి వివరాలు అందలేదన్నారు. దీనిలో ఎన్నో నిబంధనలు ఉంటాయని కమ్యూనికేషన్ అధికారులు తెలిపారు. 2016 తర్వాత ఈ నిబంధనలు ఇంకా కఠినతరం అయ్యాయన్నారు.
ఇంటర్సెప్ట్ కోసం గత ఏడాది నుంచి ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యర్థనా రాలేదని ప్రముఖ సెల్ఫోన్ ఆపరేటర్లలో ఒకటైన బీఎస్ఎన్ఎల్ అధికారి చెప్పారు. అధికారులు, మంత్రులు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులు తమ కంపెనీ సిమ్లనే వాడుతారని.. వీరి నంబర్లు ఇంటర్సెప్ట్ కోసం వస్తే వెంటనే తిరస్కరిస్తామన్నారు.
ముందుగా ఏం చేస్తారంటే.. ఇంటర్సెప్ట్ చేసే నంబర్లను అనుమతి పత్రంలో పొందుపరిచి, హోంశాఖ కార్యదర్శి లిఖిత పూర్వ అనుమతి ఇచ్చిన తర్వాతనే ఆ నంబర్లు డీవోటికి పంపాలన్నారు. డీవోటి ఆ వివరాలను సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ద్వారా సెల్ఫోన్ ఆపరేటర్లకు పంపుతుంది. సీఎంఎస్ ద్వారా వచ్చిన అభ్యర్థనను మాత్రమే సెల్ఫోన్ ఆపరేటర్లు ఆమోదిస్తారు.
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి లేదా రాష్ట్రహోంశాఖ కార్యదర్శి నుంచి 1885 టెలిగ్రాఫ్ చట్టంలోని సెక్షన్ 5(2) లిఖిత పూర్వక అనుమతి ఉండాలి.