ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును నెటిజన్లు టార్గెట్ చేశారు. ఆలయంలోకి ఆయన పార్టీ కండువా వేసుకొని వెళ్లడం ఏంటని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానంలో మూడు సింహాలు అదృశ్యమవ్వడం హాట్ టాపిక్గా మారింది. వెండి రథానికి అమర్చిన నాలుగు సింహాల్లో మూడు కనిపించడం లేదన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ విషయంలో పరిశీలించేందుకు సోము వీర్రాజుతో పాటు పలువురు నేతలు ఆలయానికి వచ్చారు.
ఆలయంలో రథం ఉన్న చోటుకు వెళ్లి తిరిగి బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాడుతూ ఇది అధికారుల నిర్లక్ష్యమే అన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఆయన పార్టీ కండువా వేసుకొని ఆలయంలోకి వెళ్లడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. చోటా మోటా నాయకుడైతే ఏమీ తెలియదని అనుకుంటాము. బీజేపీ లాంటి జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు పార్టీ కండువా వేసుకొని ఆలయంలోకి వెళ్లడం కరెక్టు కాదని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
ఏ విషయంలోనైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సోము.. ఇలాంటి తప్పులు చేయడం ఎంతవరకు సమంజసమని అంటున్నారు. ఆలయం, మసీదు, చర్చిలోకి వెళ్లేటప్పుడు పార్టీ కండువాలు పక్కన పెట్టి వెళ్లాలన్న విషయం తెలిసి ఇలా చేశారా లేదా మమ్మల్నేమి చెయ్యలేరులే అనే ధైర్యంతో ఇలా చేశాడా అని ప్నశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సోము వీర్రాజు మాత్రం అడ్డంగా బుక్కయ్యారని చెప్పొచ్చు.