ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల వెంకటేశ్వరస్వామికి సంబంధించిన సమస్యలు పరిష్కరించుకునేందుకు చర్యలు వేగవంతం అయ్యాయి. ఈ మేరకు టిటిడి చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
టిటిడికి సంబంధించిన వ్యాట్, పన్నులు రద్దు చేయాలని టిటిడి కోరుతోంది. ఇందుకోసం వై.వి సుబ్బారెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై చర్చించారు. తిరుమల ఆలయ భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్)ను నియమించుకున్న విషయం తెలిసిందే. దీనికి 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2020 జూన్ 30వ తేదీ వరకు రూ. 23.78 కోట్ల వ్యాట్, జీఎస్టీ పన్నులు రద్దు చేయాలని మంత్రికి ఆయన వివరించారు.
ఈ వివరాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన మంత్రికి అందజేశారు. ఈ పన్నులు రద్దు చేయడం వల్ల టిటిడికి సామాజిక, విద్య, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు వీలు కలుగుతుందని ఆయన కోరారు. దీంతో పాటు పెద్ద నోట్ల రద్దు సమయంలో తిరుమల దర్శనానికి వచ్చిన వారు పెద్ద మొత్తంలో వెయ్యి, ఐదువందల నోట్లు హుండీలో వేశారు. భక్తులు సమర్పిస్తున్న వీటిని అప్పట్లో టిడిపి ఏం చేయలేకపోయింది. అయితే వీటిని రిజర్వు బ్యాంకులో కానీ, ఇతర బ్యాంకుల్లో కానీ డిపాజిట్ చేయడానికి అవకాశం కల్పించాలని ఆయన మంత్రిని కోరారు. టిడిపి వద్ద మొత్తం 1.8 లక్షల వెయ్యి నోట్లు, 6.34 లక్షల ఐదు వందల నోట్లు ఉన్నాయి.