ఇండియా, చైనా మధ్య పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. అయితే యుద్ధం వచ్చే పరిస్థితులు లేవంటూనే ఏం జరిగినా సిద్దంగా ఉన్నామని భారత సైన్యం చెబుతోంది. అయితే తాజాగా ఇరు దేశాల మద్య జరిగిన ఒప్పందం చూస్తే ఇరు దేశాల మద్య శాంతి వాతావరణం కనిపిస్తోందని తెలుస్తోంది.
మాస్కోలో జరుగుతున్న షాంఝై సహకార సంస్థ సదస్సులో భారత్, చైనా విదేశాంగ మంత్రులు భేటి అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు చక్కబడేలా తీసుకోవాల్సిన చర్యలపైనే వీరు చర్చించారు. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులు ఇరు దేశాలకు మంచిది కాదని.. వెంటనే సమాన దూరం పాటిస్తూ సరిహద్దు నుంచి బలగాలు వెనక్కు వెళ్లేలా ముందుకు సాగాలని చర్చించారు.
సరిహద్దు వివాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందాలు చేసుకున్నారో వాటికి కట్టుబడాల్సిన అవసరం ఉందని మాట్లాడుకున్నారు. వీటన్నింటిని ఇప్పుడు అమలు చేయాలని భావించినట్లు తెలుస్తోంది. మరి దాదాపు నాలుగు నెలలుగా నెలకొన్న ఈ ఉద్రిక్తత ఈ భేటీతో అయినా చల్లారుతుందో లేదో చూడాలి. దాదాపు పతాక స్థాయికి చేరిన ఇరు దేశాల సరిహద్దు వివాదం ఇంకాస్త ఎక్కువైతే ఇద్దరికీ మంచిది కాదన్నది తెలిసిందే. మరి ఇప్పటికైనా చైనా తన దురాక్రమణలకు ఫులిస్టాప్ పెడుతుందో లేదో చూడాలి.