తండ్రి నట వారసత్వం ఉన్నా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి శృతి హాసన్. బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు అన్ని భాషల్లో మంచి నటిగా గుర్తింపు సంపాదించుకున్న శృతి హాసన్ ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో కమర్షియల్ చిత్రాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసింది. ‘కమర్షియల్ చిత్రాల్లో నటించాలని చెప్పే వారి మాటలను ఇక వినాలనుకోవడం లేదు. నేను కొన్ని బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాను కానీ నాకు అవి తృప్తిని ఇవ్వలేదు. ఇప్పుడు నాకు నచ్చిన కథలను ఎంచుకోవడంలో నిజాయితీగా ఉంటున్నాను’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమెపై కొన్ని వెబ్సైట్లు పలు కథనాలను ప్రచురించాయి. శృతి హాసన్కు ‘గబ్బర్ సింగ్’, ‘రేసుగుర్రం’ వంటి చిత్రాల్లో నటించడం ఇష్టం లేదని వార్తలు రాశారు. దీంతో ఈ విషయమై తాజాగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది శృతి.
ఈ అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. `జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నా ఇంటర్వ్యూ గురించి తెలుగులో వచ్చిన ఆర్టికల్స్ పూర్తిగా అవాస్తవాలు. `గబ్బర్సింగ్`, `రేసుగుర్రం` వంటి సినిమాల్లో భాగమైనందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నా. పవన్కల్యాణ్గారితో చేసిన `గబ్బర్ సింగ్` నా జీవితాన్ని మార్చింద`ని శ్రుతి పేర్కొంది.
Certain Telugu publications have misinterpreted a quote from a national interview I gave and are writing articles that are untrue. Just to clarify I am extremely proud of having been a part of films like race gurram and Gabbar Singh- GS with Pawan Kalyan Garu was life changing !!
— shruti haasan (@shrutihaasan) October 6, 2020