దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు, ఇటు ఇండస్ట్రీలనూ భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా నిలిచిపోయింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటి శ్రియ కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. అయితే ఎన్టీఆర్, రామ్చరణ్తో శ్రియకు సన్నివేశాలు లేవు. లాక్ డౌన్ కంటే ముందే శ్రియపై సన్నివేశాలు చిత్రీకరించారు. ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రియ.. ‘ఆర్ఆర్ఆర్’, దర్శకుడు రాజమౌళి గురించి పలు వ్యాఖ్యలు చేసింది.
ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ…’‘ఛత్రపతి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది. కొత్త అంశాన్ని చెప్పడానికి ఆయనకు గ్రాండ్ విజన్ ఉంది. ఇందులో నేను చేసింది చిన్న అతిథి పాత్రే అయినా నాకు, సినిమాకు అది చాలా ప్రత్యేకం. అజయ్ దేవగణ్తో నాకు కాంబినేషన్ సన్నివేశాలున్నాయి. తారక్, చరణ్తో సన్నివేశాలు లేకపోవడం బాధాకరం. అయినా ఓ మంచి సినిమాలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. కరోనా మహమ్మారి త్వరగా తగ్గి థియేటర్స్ తెరుచుకోవాలి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను పెద్ద తెరపై చూడాలి’’ అని శ్రియ అన్నారు.