ఐ.ఎ.ఎస్ అధికారిణి అమ్రపాలి విధుల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమెను ఆస్థానం నుంచి మారుస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
అమ్రపాలి తెలుగు ప్రజలకు బాగా తెలిసిన ఐఎఎస్ అధికారిణి. ఈమె తెలంగాణాలోని వికారాబాద్లో సబ్ కలెక్టర్గా, రంగారెడ్డి జిల్లా జేసీగా, వరంగల్ జిల్లా కలెక్టర్గా పనిచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘంలో అధికారిణిగా సేవలందించారు. అనంతరం అమ్రపాలి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియేట్లో డిప్యూటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఆమెను పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా నియమిస్తూ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయంలో పనిచేయడానికి ముగ్గురు అధికారులు నియమితులయ్యారు. వీరిలో రఘురాజ్ రాజేంద్రన్ పీఎంవోలో డైరెక్టరుగా, మంగేశ్ గిల్దియాల్ అండర్ సెక్రటరీగా, డిప్యూటీ కార్యదర్శిగా అమ్రపాలి నియమితులయ్యారు. ఈమె ఈ పదవిలో 2023 అక్టోబర్ 27 వరకు కొనసాగనున్నారు. ఈ పదవిలో నియమింపబడిన అతి పిన్న వయస్కులలో ఆమె కూడా ఒకరు.