బీహార్ ఎన్నికలు దేశ వ్యాప్తంగా కుదిపేస్తున్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ ఈ ఎన్నికలను సవాల్గా తీసుకుంది. దేశంలో మోదీ హవా ను మరోసారి రుజువు చేసే రీతిలో ఈ ఎన్నికల ఫలితాలు ఉంటాయని అంతా అనుకుంటున్నారు. ఇక ఇదే సమయంలో గట్టిగా ఢీకొట్టేందుకు కాంగ్రెస్ సైతం సిద్దంగా ఉంది.
దేశ వ్యాప్తంగా బీహార్ ఎన్నికల గురించి చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం నితీష్ కుమార్ సైతం ఈ ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఆయన స్టైల్లో రాజకీయాన్ని నడిపిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ వధంగా ముందుకు వెళుతుంటే ప్రజలు మాత్రం తమ తీర్పు చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు. అయితే బీహార్లోని గిరిజనులు మాత్రం ఈ ఎన్నికలకు ఇష్ట పడటం లేదు. తమపై జరుగుతున్న దాడులను వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఫలితంగా ఎన్నికలను బహిష్కరించేందుకు మొగ్గుచూపుతున్నారు.
గిరిజనులపై పోలీసులు దాడులు చేయడాన్ని నిరసిస్తూ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు కైమూర్ ముక్తి మోర్చా అంటోంది. కైమూర్ ప్రాంతంలో గిరిజనుల పట్ల పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. 25 మంది కైమూర్ కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్టు చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. అటవీశాఖ బలవంతంగా పోలీసులను ఉపయోగించి దాడులు చేయిస్తున్న నేపథ్యంలో గిరిజన గ్రామాల ప్రజలు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు. దీంతో ఈ ప్రాంతంలోని 108 గ్రామాల ప్రజలు ఈ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారు. మరి దీనిపై బహిరంగ ప్రకటన కూడా విడుదల చేశారు. రాజకీయ పార్టీలకు ఈ గ్రామాల ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉండటం మైనస్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి వీరి విషయంలో ప్రభుత్వం కానీ, రాజకీయ నాయకులు కానీ ఏమైనా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తారేమో చూడాలి.