రాజకీయాల్లో చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద దుమారం రేపుతుంటాయి. తాజాగా బీహార్ ఎన్నికల మేనిఫెస్టోలో కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామని బీజేపీ చెప్పడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. బీహార్ ఎన్నికల్లో గెలవకపోతే వ్యాక్సిన్ ఇవ్వరా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఒకవేళ గెలిస్తే బీహార్లో ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చి ఇతర ప్రాంతాల్లో ఇవ్వరా అంటున్నారు.
ఉచిత వ్యాక్సిన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం బీజేపీ చేసిన పొరపాటని అందరూ అంటున్నారు. తాజాగా శివసేన సామ్నా వేదికపై బీజేపీని ఏకిపారేసింది. కోవిడ్ వ్యాక్సిన్ పై బీజేపీ రాజకీయాలు చేస్తోందని పేర్కొంది. బిహార్కు కరోనా వ్యాక్సిన్ అందాలి. కానీ ఇతర రాష్ట్రాలేమైనా పాకిస్తాన్ లో ఉన్నాయా.. వ్యాక్సిన్ పై అన్ని రాష్ట్రాలకూ సమాన హక్కులున్నాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. కరోనా దేశ వ్యాప్తంగా విజృంభిస్తోందని.. అలాంటప్పుడు బీహార్లో కరోనా వ్యాక్సిన్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని మండిపడింది.
కరోనా వ్యాక్సిన్ వస్తే అందరికీ అందేలా చూస్తామని ప్రధాని మోదీ చెబుతుండగా.. బీహార్లో బీజేపీ మాత్రం వ్యాక్సిన్ రాజకీయాలు చేస్తోందంది. ఈ విషయంలో బీజేపీకి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియడం లేదని విమర్శించింది. ఇక బీహార్లో కరోనా నిబంధనలు ఎవ్వరూ పాటించడం లేదని.. బౌతిక దూరం పాటిస్తూ ప్రచారాలు నిర్వహించడం లేదని పేర్కొంది. మొత్తానికి బీజేపీ పెట్టిన హామీ పై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ దీనిపై వ్యంగాస్త్రాలు సంధించారు. మీరు నాకు రక్తానివ్వండి.. నేను మీకు స్వాతంత్రం ఇస్తా అన్నది అప్పటి నినాదమని.. ఇప్పుడు మీరు నాకు ఓటు వేయండి. మేము మీకు వ్యాక్సిన్ ఇస్తామన్నది ఇప్పటి మాట అంటూ ఆయన వ్యంగంగా స్పందించారు.