బీజేపీ, శివసేన పార్టీల బంధం గురించి అందరికీ తెలిసిందే. ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న ఈ రెండు పార్టీలు గత ఎన్నికల నుంచి పూర్తి శత్రువులుగా మారిపోయాయి. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ..శివసేన కలిసి పోటీ చేసినప్పటికీ ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే విషయంలో ఇరు పార్టీల మధ్య తేడా రావడంతో ఈ కూటమి కూలిపోయింది.
ఆ తర్వాత మహారాష్ట్రలో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. శివసేన 56 స్థానాలే దక్కించుకున్నప్పటికీ ఎన్నికలకు ముందే ఇరు పార్టీల మధ్య సీఎం పీఠంపై ఒప్పందం కుదిరిందని శివసేన పేర్కొంది. అయితే అలాంటి ఒప్పందమేదీ జరగలేదని బీజేపీ పేర్కొనడంతో శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కూటమి కట్టి ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన నేపథ్యంలో శివసేన బీజేపీని టార్గెట్ చేసింది.
తక్కువ స్థానాలు వచ్చినా నితీశ్ ముఖ్యమంత్రి పీఠం నిలబెట్టుకుంటే అది కచ్చితంగా తమ చలవేనంటూ ఆ పార్టీ పేర్కొంది. జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినా ముఖ్యమంత్రి పీఠం నితీశ్కే ఇస్తామంటూ బీజేపీ ఇచ్చిన హామీని శివసేన గుర్తుచేసింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శివసేనకు కూడా బీజేపీ ఇదే తరహాలో హామీ ఇచ్చిందనీ.. కానీ ఆ మాట నిలబెట్టుకోలేదంటూ దుయ్యబట్టింది. దీనికారణంగానే మహారాష్ట్రలో రాజకీయ హైడ్రామా చోటుచేసుకున్నట్టు తెలిపింది. జేడీయూకి తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ నితీశ్కే బీహార్ ముఖ్యమంత్రి పదవి ఇస్తామని బీజేపీ నేత అమిత్ షా హామీ ఇచ్చారని సామ్నా పత్రికలో పేర్కొంది.
మహారాష్ట్రలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు కూడా ఆయనే ఇదే హామీ ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోలేదని రాసింది. దీంతో రాష్ట్రంలో రాజకీయ మహాభారతం చోటుచేసుకుంది. ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చినా నితీశ్ కుమార్ బీహార్ సీఎం అయితే అది కచ్చింతంగా శివసేన చలవే అంటూ బీజేపీని ఇలా టార్గెట్ చేసింది. ఎందుకంటే నితీష్ సీఎం కాకపోతే ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మహారాష్ట్రలో బీజేపీకి ఎదురైన అనుభవమే ఇక్కడ కూడా ఎదురవుతుందన్నది దానిలో అర్థం.