దేశ వ్యాప్తంగా అందరి దృష్టీ స్కూల్స్పైనే ఉంది. కరోనా వచ్చిన తర్వాత ఇంతవరకు స్కూల్స్ ఓపెన్ కాలేదు. పలు చోట్ల మాత్రమే ఆన్లైన్లో క్లాసులు నడుస్తున్నాయి. దీంతో కేంద్రం కూడా పాఠశాలలపై నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది.
ఢిల్లీలో స్కూల్స్ ఇప్పట్లో తెరిచేలా లేరు. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల మూసివేత కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తెలిపారు. అక్టోబర్ 31 నుంచి పాఠశాలలు తెరుచుకుంటాయని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఇప్పుడు తాజా నిర్ణయం వెలువరించింది. కరోనా దృష్ట్యా అయోమయం కొనసాగుతుందని తల్లిదండ్రులు సైతం ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. స్కూళ్లు తిరిగి తెరిచేందుకు తల్లిదండ్రులు కూడా సుముఖంగా లేరని బుధవారం జరిగిన ఆన్లైన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో నీష్ సిసోడియా పేర్కొన్నారు
.స్కూళ్లు తెరవడం సురక్షితమా కాదా అనే దానిపై సహజంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారన్నారు. దీనిపై ఎప్పటికప్పుడు వారిని సంప్రదిస్తున్నట్లు చెప్పారు. స్కూళ్లు తెరిచిన చోట పిల్లల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్నాయని అన్నారు. దీంతో ఇప్పటికిప్పుడు దేశ రాజధానిలో స్కూళ్లు తెరవరాదని తాము నిర్ణయించినట్లు చెప్పారు. స్కూళ్లు తెరిచే ముందు ఉత్తర్వులు ఇస్తామని.. ఇప్పటికైతే పాఠశాలలు తెరవాలన్న ఆలోచన చేయడం లేదని తెలిపారు. మరి ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఏవిధంగా ఉందన్నది ప్రశ్నార్థకంగా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలలో స్కూల్స్ ఓపెన్ చేయడంపై ప్రభుత్వం ఆలోచించుకోవాలని మేదావులు సూచిస్తున్నారు. కరోనాను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.