ఏపీలోని గుంటూరులో రైతులకు సంకెళ్లు వేసిన ఘటనపై పోలీసులు అప్రమత్తమయ్యారు. రైతులకు బేడీలు వేయడంపై గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని సీరియస్ అయ్యారు. ఆరుగురు ఎస్కార్ట్ హెడ్ కానిస్టేబుళ్లను సప్పెండ్ చేశారు. ఆర్ఎస్ఐ, ఆర్ఐలకు చార్జ్ మెమో ఇచ్చారు. అంతేకాకుండా అడిషనల్ ఎస్పీతో విచారణ కమిటీని నియమించారు.
రాజధాని రైతుల చేతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మంగళగిరి మండలం, కృష్ణాయపాలెంకు చెందిన రాజధాని రైతులను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు. దీనిపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అని అడిగి అధికారం తీసుకుంది ఇందుకేనా అని చంద్రబాబు ప్రశ్నించారు. రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కు మరో అప్రదిష్ట మూటగట్టారని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే చర్చకు దేశవ్యాప్తంగా తెరదీశారన్నారు.
గత 17 నెలలుగా రాష్ట్రంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవని.. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభ పెడుతున్నారన్నారు. రాజధాని రైతుల చేతులకు బేడీలు వేయడం తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధమని.. గతంలో రైతుల కాళ్లకు బేడీలు వేసిన పార్టీకి పట్టిన గతే వైసీపీకి కూడా పడుతుందన్నారు. రైతులకు బేడీలు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.