ఆంధ్రప్రదేశ్లో ఏ ఘటన జరిగినా దాంతో వెంటనే రాజకీయాలు చేయాలన్న దురాలోచనను నాయకులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. శాంతిభద్రతలకు సంబంధించిన అంశంలో ఎంతో ప్రశాంతంగా వ్యవహరించాల్సిన పలు రాజకీయ పార్టీలు ప్రజలను రెచ్చగొట్టే ధోరణలో ముందుకు వెళుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమనూరులో సాయిబాబా విగ్రహం ద్వంసం అయిన ఘటనే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తుంది.
ఇక్కడ సాయిబాబా విగ్రహం ధ్వంసం అయిన విషయంలో ప్రతిపక్ష పార్టీల నాయకుల వ్యవహారశైలి ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోంది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఎలాంటి వివాదాలు జరగకుండా పోలీసులు ఘటన జరిగిన వద్ద మధ్యాహ్నానికే కొత్త విగ్రహం తెచ్చి పెట్టారు. ఘటన జరిగిన వెంటనే ప్రతిపక్ష టిడిపి నేతలు అక్కడకు వెళ్లగా స్థానికులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. తమ గ్రామ సమస్యలో ఎవ్వరూ తలదూర్చడానికి వీళ్లేదని తామే పరిష్కరించుకుంటామని వారు తెలుగుదేశం పార్టీ నేతలకు తెగేసి చెప్పారంట.
బీజేపి, జనసేన పార్టీల నేతలు కూడా అక్కడకు వెళ్లగా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఎవరో దుండగులు చేసిన ఈ పనిని రాజకీయాలు చేయడం వద్దని గ్రామస్థులు చెప్పారు. దీంతో కేవలం అక్కడకు వచ్చిన మీడియాతో మాట్లాడి నాయకులు వెనుదిరిగారు. మామూలుగా అయితే ఘటన జరగ్గానే ఆవేశంతో ఊగిపోయిన గ్రామస్థులు.. ప్రజల్లో వివాదం చెలరేగకుండా సర్దుకొని పోతుండటం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. చిన్న చిన్న విషయాలను రాజకీయ కోణంలో చూస్తూ స్థానికుల మధ్య విధ్వేషాలు రాకుండా చూసుకోవడం నిజంగా మంచి పరిణామం. సాయిబాబా విగ్రహం ధ్వంసం అయిన విషయాన్ని స్థానికంగా ఉండే పూలు అమ్మే వ్యక్తి పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. అయితే మందుబాబులెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.