చిత్రలహరి, ప్రతి రోజు పండగే వంటి వరుస విజయాలతో జోష్ మీదున్నాడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. ఇక ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇదిలా ఉంటే వచ్చే నెల నుంచి మరో కొత్త సినిమా మొదలు పెట్టడానికి సిద్ధమవుతున్నాడు తేజ్. ‘ప్రస్థానం’ ఫేమ్ దేవకట్టా దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి తేజ్ ఇటీవలే సైన్ చేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్.. ఈ సినిమాని వచ్చే నెల మూడవ వారం నుంచి మొదలు పెట్టనున్నారు.
ఇదిలా ఉంటే చిత్ర కథకి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో విభిన్న కథాంశంతో ఉండనుందని సమాచారం. దేవకట్ట గతంలో దర్శకత్వం వహించిన ప్రస్థానం కూడా.. రాజకీయాల నేపథ్యంతో తెరకెక్కిన సినిమా అని తెలిసిందే. ప్రస్థానం చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తనకు మంచి పేరు తెచ్చి పెట్టిన రాజకీయ కథాంశంతో దర్శకుడు దేవకట్టా… మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.