శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగేటట్లు ఉంది. నిన్న రాత్రి నాలుగో యూనిట్ టర్మినల్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. విద్యుత్ తయారీ కేంద్రంలో అర్దరాత్రి మంటల చెలరేగగా సిబ్బంది అదుపు చేయబోయారు. ఈ క్రమంలో మంటలు ఎక్కువ అయ్యాయి.
దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 30 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో 15 మంది వెంటనే బయటకు వచ్చేశారు. మరో ఆరుగురిని రక్షించారు. 9 మంది మాత్రం రాత్రి నుంచి లోపలే ఉన్నారు. వీరిలో ఆరుగురి మృతదేహాలు ఇప్పుడు బయటపడ్డాయి.
అయితే మిగిలిన వారు ఏమయ్యారో ఇంకా తెలియాల్సి ఉంది. రాత్రి నుంచి పొగ ఎక్కువగా ఉండటంతో ఫైర్ సిబ్బందికి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పుడు రెస్క్యూ టీం సహాయ చర్యలు చేపడుతోంది. మంత్రి జగదీష్ రెడ్డి, అధికారులు ఘటనా స్థలంలోనే ఉన్నారు.
ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢా సానుభూతి తెలిపారు. ఘటన ఎలా జరిగిందో అన్న దానిపై సీఐడి విచారణకు సీఎం ఆదేశించారు.