సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. ఆయన ప్రతి సినిమా వివాదానికి దగ్గర్లోనే ఉంటుంది. తాజాగా ఆయన సినిమా మర్డర్ పై సందిగ్దత నెలకొంది.
ఓ యదార్థ సంఘటన ఆధారంగా రాంగోపాల్ వర్మ తీసిన కల్పిత చిత్రం మర్డర్. ప్రస్తుతం ఈ సినిమా వివాదం కోర్టులో ఉంది. అందుకే రిలీజ్పై ఇంకా సందిగ్ధత నెలకొంది. ఈ సినిమా తమ జీవితాలకు సంబంధించినదే అంటూ నల్గొండ జిల్లాకు చెందిన అమృత కోర్టుకు వెళ్లారు. ఈమేరకు గత నెల 29వ తేదీన సినిమా డైరెక్టర్, నిర్మాతలపై సూట్ ఫైల్ వేశారు.
తన భర్తను కోల్పోయి ఇప్పటికే చాలా బాధపడుతున్నానని.. మళ్లీ కల్పిత పాత్రలతో సినిమాను తీసి తమ జీవితాలతో ఆడుకోవడం సరికాదన్నారు. దీంతో ఈ సినిమాను తక్షణమే నిలిపివేసేలా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఆమె కోర్టుకు విన్నవించారు.
నేడు ఈ కేసులో విచారణ జరిగింది. తాను ఎవ్వరినీ కించపరిచేలా సినిమా తీయలేదని రాంగోపాల్ వర్మ కౌంటర్ దాఖలు చేశారు. ముప్పై ఏళ్లుగా తాను సినిమాలు తీస్తున్నట్లు పేర్కొన్నారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది.