ఓ ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్టుపై రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని, అతనితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మధ్యంతర బెయిల్పై విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ చంద్రచుడ్ నేతృత్వంలోని బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది.
రూ.50,000 పూచీకత్తు కింద మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని, ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాన్ని సుప్రీం ఆదేశించింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ అర్నాబ్ పెట్టుకున్న ఓ పిటిషన్ మేరకు సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. బెయిల్ ఇచ్చేందుకు బోంబే హైకోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ అర్నాబ్ నిన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్నాబ్ గోస్వామి అరెస్టుపై సుప్రీంకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ఆయన సిద్ధాంతం ఏదైనా కావచ్చు. నేను కనీసం ఎప్పుడూ ఆయన చానెల్ కూడా చూడలేదు. కానీ ఈ కేసులో రాజ్యాంగ ధర్మాసనం జోక్యం చేసుకోకపోతే మనం నిస్సందేహంగా పతనం దిశగా పోతున్నట్టే. అసలు విషయం ఏమంటే.. మీరు ఈ ఆరోపణల కింద ఒకరి వ్యక్తిగత స్వేచ్ఛను నిరాకరించవచ్చా అనేదే అని జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు.