ప్రస్తుతం అంతా డిజిటల్ ట్రెండ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా కరోనా కారణంగా లాక్డౌన్ విధించిన తర్వాత థియేటర్లు మూతపడడంతో సినీ నిర్మాతలంతా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇటీవల నాని హీరోగా నటించిన ‘వి’ సినిమా కూడా ఓటీటీలో విడుదల కావడంతో మిగతా నిర్మాతలకు ధైర్యానిచ్చినట్లైంది. ఈ క్రమంలోనే కొన్ని బడా సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికితగ్గట్లే ఓటీటీ సంస్థలు కూడా నిర్మాతలకు భారీగానే ముట్టజెప్పుతున్నాయి.
ఇదిలా ఉంటే తెలుగు మీడియాతో పాటు సినిమా ఇండస్ట్రీలోనూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రామోజీ రావు కూడా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మారుతోన్న కాలానికి తగ్గట్లు ఎప్పటికప్పుడు మారే రామోజీ ఓటీటీ రంగంలోకి కూడా రానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఈటీవీ భారత్ పేరుతో డిజిటల్ న్యూస్కు తెరలేపిన రామోజీ ఇప్పుడు సొంతంగా ఒక ఓటీటీ ఛానల్ను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీవీ, పత్రిక, వ్యాపార రంగాల్లో తనదైన ముద్ర వేసిన రామోజీ మరి ఓటీటీలో ఎంతవరకు రానిస్తారో చూడాలి.