సంచలనం రేపిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాద ఘటనలో హైకోర్టు ముగ్గురికి బెయిల్ మంజూరు చేసింది. స్వర్ణప్యాలెస్ హోటల్లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్నసమయంలో ప్రమాదం జరిగి 10 మంది చనిపోయిన విషయం తెలిసిందే.
అయితే ప్రమాదం జరిగిన రోజున రమేష్ హాస్పిటల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ కొడాలి రాజగోపాల్ రావుతో పాటు జనరల్ మేనేజర్ డాక్టర్ కురపతి సుదర్శన్, స్వర్ణ ప్యాలెస్ హోటల్లోని ఆసుపత్రి కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లబోతు వెంకటేష్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరికి నేడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇక ఇదే కేసులో రమేష్ హాస్పిటల్స్ యజమాని డాక్టర్ రమేష్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈయన కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఈయన ఇటీవలె హైకోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారు. అయితే ఈ స్టేను ఎత్తేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ప్రభుత్వం మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించింది.
ఇక ఈ కేసు విచారణలో డాక్టర్ రమేష్ ను విచారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం చెబుతోంది. రమేష్ హాస్పిటల్స్ది తప్పు లేకపోతే ఎందుకు ఆయన పరారీలో ఉన్నారన్న అనుమానాలు వస్తున్నాయి. మొత్తం మీద ఇప్పుడు కాకపోతే మరో రోజైనా డాక్టర్ రమేష్ బయటకు వచ్చి విచారణ ఎదుర్కొనాల్సి ఉంటుంది.