ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డికి దేశంలోనే మంచి పేరు ఉంది. ఎందుకంటే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, సంక్షేమ పథకాలే ఇందుకు కారణం. అయితే ఇదే సమయంలో ఆయనకు ఇప్పుడు కాస్త గడ్డు కాలం నడుస్తోందని చెప్పాలి.
విభజన అనంతరం ఏపీ పరిస్థితి ఏమీ బాగోలేదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎలాగోలా నెట్టుకొచ్చారు. ఇప్పుడు జగన్ అధికారం చేపట్టాక ఆర్థిక లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలలో ఎలాంటి వెనుకడుగూ వేయలేదు. అమ్మఒడి నుంచి రైతు భరోసా, వైఎస్సార్ చేయూత ఇలా అన్ని పథకాలతో ప్రభుత్వం సూపర్హిట్గా ముందుకు వెళుతోంది.
ఇక ప్రధానంగా 1వ తేదీ రాగానే అందరికీ పించన్లు అందజేస్తున్నారు. మరి ఇంత చేస్తున్న జగన్ సర్కార్ పదవీ విరమణ పొందిన ఉద్యోగుల పెన్షన్ విషయంలో మాత్రం తడబడుతోంది. నెల వచ్చేసింది ఉద్యోగుల జీతాలు, సామాజిక పించన్లు ఇచ్చేసినా ఇప్పుడు పెన్షన్ల అమౌంట్ ఇంకా ఇవ్వలేదు. ఈ నెలలో ఈ ఇబ్బందులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెన్షన్ల కోసం పదిహేను వందల కోట్లు అవసరం అవుతుంది. ఈ మొత్తం అమౌంటు ఇప్పుడు ప్రభుత్వం దగ్గర లేదు. దీంతో ఈ నగదు సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.
అయితే అన్నింటిలో శభాష్ అనిపించుకుంటున్న జగన్ పెన్షన్ల విషయంలో మాత్రం చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. మరి అధికారం చేపట్టిన అతి తక్కువ కాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జగనన్న పెన్షనర్ల దగ్గర కూడా మంచి పేరు తెచ్చుకుంటారో లేదో వేచి చూడాలి.