సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రానికి సంబంధించి ఇంకా టెన్షన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఆయన రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించేశారు. త్వరలోనే పార్టీ ప్రకటిస్తానని చెప్పారు. అయితే అంతలోపే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్లో చేరడం డిశ్చార్జ్ కావడం జరిగిపోయాయి. అయితే ముందుగా అనుకున్నట్లు ఈనెల 31వ తేదీన ఆయన పార్టీ ప్రకటన చేస్తారని అంటున్నారు.
అయితే ఆయన ఆరోగ్యం దృష్ట్యా డాక్టర్లు మరి కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని పార్టీని రెండింటినీ దృష్టిలో పెట్టుకొని రజినీ కీలక నిర్ణయం తీసుకుంటున్నారు. రజనీకాంత్ పార్టీ ప్రకటనను సామాజిక మాధ్యమాల ద్వారా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఆయన బహిరంగసభలు, మీడియా సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ముందుగా నిర్ణయించిన మేరకు పార్టీ ప్రకటన చేయాల్సిందేనని రజనీ భావిస్తున్నారు. దీంతో సామాజిక మాధ్యమాల ద్వారా పార్టీ ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు ‘రజనీ మక్కల్ మండ్రం’ వర్గాలు చెబుతున్నాయి.
అయితే పార్టీ ప్రారంభోత్సవం మాత్రం ఘనంగా ఉంటుందని, వచ్చే నెలలో దివంగత ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఆ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. మరోవైపు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే రజినీని టార్గెట్ చేస్తున్నాయి. సూపర్స్టార్ రజనీకాంత్కు ముఖ్యమంత్రి అయ్యే ఉద్దేశ్యం లేదని, ఆధ్యాత్మిక బాటలో పయనిస్తున్న ఆయన రాజకీయవేత్త కాదని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి పేర్కొన్నారు. మరి రజినీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటన ఉంటుందా లేదా అన్నది ఒకటి రెండు రోజుల్లో తెలియనుంది.