సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాలపై పూర్తిస్థాయి ఫోకస్ పెడుతున్నట్లు కనిపిస్తోంది. జనవరిలో పార్టీ ప్రకటిస్తానని చెప్పిన ఆయన అంతకుముందు స్పష్టమైన ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి మక్కల్ మండ్రం నేతలందరికీ రజనీ ఫోన్ చేసి బుధవారం రాఘవేంద్ర కల్యాణమండపంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు. స
దీంతో బుధవారం ఉదయం మక్కల్ మండ్రం నేతలంతా చెన్నైకి ఆగమేఘాలపై తరలివచ్చారు. రాఘవేంద్ర కల్యాణ మండపంలో గతంలోలా ఎలాంటి పోలీసుభద్రతా ఏర్పాట్లు లేకుండా మీడియాను దూరంగా ఉంచి రజనీ కాంత్ మండ్రం నేతలతో సమావేశమై చర్చించారు. డిసెంబర్ 31న పార్టీ ప్రారంభ ప్రకటన చేయాల్సి ఉందని, మదురై లేదా తిరుచ్చి నగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అభిమానుల సమక్షంలో ప్రకటిస్తే బాగుంటుందా అని అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 14 నుంచి తాను ‘అన్నాత్తే’ షూటింగ్కు హైదరాబాద్ వెళ్లి నెలాఖరుకు చెన్నై తిరిగి వస్తానని రజనీ చెప్పారు.
ఆ పరిస్థితుల్లో పార్టీ ప్రకటన సభకు భారీ ఏర్పాట్లు చేపట్టేందుకు మక్కల్ మండ్రం నేతలు రంగంలోకి దిగాలని రజనీ కోరారు. ఇక పార్టీకి ఏ పేరు పెట్టాలి? ఏ గుర్తును ఎంపిక చేసుకోవాలి? అనే విషయాలపై కూడా ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కాగా నవంబర్ 30న రజనీకాంత్ రాష్ట్రవ్యాప్తంగా రజనీ మక్కల్ మండ్రం జిల్లా శాఖ నేతలు, నియోజకవర్గాల ఇన్చార్జీలతో సమావేశమయ్యారు. ఈ నెల 3న రజనీకాంత్ హఠాత్తుగా తన ట్విట్టర్ పేజీలో రాజకీయ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత పోయెస్గార్డెన్ నివాసగృహం వద్ద మీడియాతో మాట్లాడు తూ… వచ్చే యేడాది జనవరిలో పార్టీ పెడతానని, ఆ వివరాలను డిసెంబర్ 31న ప్రకటిస్తానని పేర్కొన్నారు. తరువాత రజనీ బెంగళూరు వెళ్లి తన సోదరుడు సత్యనారాయణ ఆశీస్సులు తీసుకుని రెండు రోజుల క్రితం చెన్నై తిరిగి వచ్చారు. అదే సమయంలో ప్రత్యేక సలహదారు మణియన్ రజనీని కలుసుకుని భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.