బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా కారుపై దాడి.. ఎవ‌రు కాపాడారో చెప్పిన న‌డ్డా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బెంగాల్ పర్యటన ఉద్రిక్తంగా మారింది. ఆయన కాన్వాయ్‌పై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. నడ్డా కాన్వాయ్ తో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కైలాస్ విజయ వర్గీయ వాహనంపై కూడా ప్రత్యర్థులు రాళ్ల దాడికి దిగారు. కోల్‌కతాలోని డైమండ్ హార్బర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో ఈ దాడి జరిగిందని రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రకటించారు. కారులో ప్రయాణిస్తున్న సందర్భంలో జరిగిన రాళ్ల దాడిన విజయ వర్గీయ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియోనుబట్టి బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న కార్లపై ఇటుకలు, రాళ్ళతో దాడి జరిగినట్లు కనిపించింది. కార్ల అద్దాలు పగిలిపోవడం కనిపించింది. ఈ దాడిలో బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయ గాయపడినట్లు జేపీ నడ్డా విలేకర్లకు చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అని ఆరోపించారు. తమ కాన్వాయ్‌లోని అన్ని కార్లపైనా దాడి జరిగిందన్నారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణించడం వల్ల సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో అరాచక, అసహన పరిస్థితులకు తెరపడాలన్నారు. ‘‘నేను సమావేశానికి రాగలిగానంటే, అది కేవలం దుర్గా మాత దయ వల్లనే’’ అని జేపీ నడ్డా తెలిపారు.

కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, ఈ దాడిలో తాను గాయపడ్డానన్నారు. జేపీ నడ్డా ప్రయాణిస్తున్న కారుపై కూడా దాడి జరిగిందన్నారు. తాము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసుల సమక్షంలోనే గూండాలు తమపై దాడి చేశారన్నారు. మేము మన దేశంలోనే ఉన్నామా? అనే భావన తమకు కలిగిందని చెప్పారు. బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ చీఫ్ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్ళతో నడ్డా కాన్వాయ్‌పై దాడి చేశారన్నారు. నడ్డాకు జెడ్-కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, దాడి జరుగుతున్నపుడు పోలీసులు ప్రేక్షకుల్లా చూశారని ఆరోపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here